న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని నోయిడా సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ లగ్జరీ కారు.. యూటర్న్ తీసుకుంటున్న స్కూటీని ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న దీపిక త్రిపాఠి (24)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు.
ఓ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న దీపికా త్రిపాఠి ఆదివారం ఉదయం నోయిడాలోని సెక్టార్ 96 వద్ద ఆఫీస్ వైపు మళ్లేందుకు తన స్కూటీని యూటర్న్ తీస్తున్నది. సరిగ్గా అదే సమయంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన లగ్జరీ కారు జాగ్వర్ ఆ స్కూటీని ఢీకొట్టింది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో స్కూటీని కొంతదూరం ఈడ్చుకెళ్లింది.
ప్రమాదం అనంతరం నిందితుడు కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని వెతికి పట్టుకున్నారు. అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.