న్యూఢిల్లీ, జూలై 22: బ్రిటిషర్లు, వారి కోర్టుల వ్యవస్థ రాక మునుపు భారత్లో సాధారణంగా అనుసరించిన మధ్యవర్తిత్వ పద్ధతి… ఇప్పుడు వివాదాల పరిష్కారానికి చాలా కీలక విధానమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. భవిష్యత్తులో మధ్యవర్తిత్వ పద్ధతి అవసరం మరింత పెరుగుతుందని చెప్పారు. బ్రిటిషర్లు ఆధునిక భారత న్యాయవ్యవస్థకు ఒక రూపాన్ని ఇవ్వడమే కాక వివాద పరిష్కారానికి, న్యాయానికి నల్లకోట్లు, విస్తృత వాదోపవాదాలు అవసరమన్న అపోహను కూడా సృష్టించారని చెప్పారు.
‘ఇంటర్నేషనల్ వర్చువల్ మీడియేషన్ సమ్మర్ స్కూల్, 2021’ కార్యక్రమంలో జస్టిస్ రమణ ప్రసంగించారు. వ్యాజ్యాల విచారణ ప్రక్రియపై అసంతృప్తితో రెండు పార్టీల్లో ఒకరు నేరుగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తున్నారని, ఇది కేసుల పరిష్కారంలో ఆలస్యాన్ని పెంచుతున్నదన్నారు. ఈ సమస్యకు కూడా మధ్యవర్తిత్వ పద్ధతి ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. మరోవైపు, దేశంలో సంపన్నులకు, పేదలకు వేర్వేరుగా రెండు సమాంతర న్యాయవ్యవస్థలు ఉండవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ్కు చెందిన ఓ బీఎస్పీ ఎమ్మెల్యే భర్తకు మంజూరైన బెయిల్ను రద్దు చేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.