ఆగ్రా: చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండగా వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరసే ఇందుకు కారణమవుతోంది. ఈ క్రమంలోనే గత వారం గుజరాత్లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వేరియంట్ బయటపడింది.
దాంతో వెంటనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో సమావేశమై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణ సహా రాష్ట్రాలు సైతం అప్రమత్తంగా ఉన్నాయి. కొత్త రకం కొవిడ్ విజృంభించినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి.
ఈ క్రమంలోనే ఇవాళ ఉత్తరప్రదేశ్లో చైనా నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతున్నది. దాంతో అతడు ఉన్న భవనం చుట్టూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అతడి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం లక్నో ల్యాబ్కు పంపించారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ వస్తే అతనిలో ఉన్నది ప్రమాదకర బీఎఫ్-7 వేరియంటా.. కాదా..? అనేది తేలిపోనుంది.
కాగా, సదరు వ్యక్తి ఈ నెల 22న చైనా నుంచి భారత్కు వచ్చాడని, 23న ఆగ్రాలో పర్యటించాడని, ఆ తర్వాత అతను దేశంలోని మరే ఇతర పబ్లిక్ ప్లేస్కు వెళ్లలేదని ఉత్తరప్రదేశ్ సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం అతని శాంపిల్ సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపింది.