న్యూఢిల్లీ, మే 3: ‘మనం హిందుస్థానీలం. హిందీ మాట్లాడు హిందీ!’ అంటూ ఉత్తర భారతదేశానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఓ కర్ణాటక మహిళను ఒత్తిడి చేయడంతో పాటు బెదిరించారు. హిందీని బలవంతంగా రుద్దేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
పడవల్లో బోటింగ్కు వెళ్లిన సమయంలో జరిగినట్టు కనిపిస్తున్న ఈ ఘటన.. ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేదు. కన్నడ భాష యాసను ఎగతాళి చేయడంతో పాటు ‘హిందీ మాట్లాడు.. వందేమాతరం అను’ అంటూ మహిళను బెదిరించారు. సదరు మహిళ ఎంతో ధైర్యంగా వారితో వాగ్వివాదానికి దిగింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. వందేమాతరం నినాదం హిందీ కాదు.. బెంగాలీ అంటూ ఓ నెటిజన్ ఎత్తిచూపారు.