న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రధాని నరేంద్ర మోదీ, ఆయనకు చెందిన బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నేడు భారత్ మరింత సుసంపన్నంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉండేదని ఒక కొత్త పరిశోధన అధ్యయనం పేర్కొంది. దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను, వచ్చిన ఫలితాలతో పోలుస్తూ మోదీ పాలన విఫల వాగ్దానాల కథగా అధ్యయనం అభివర్ణించింది. టెక్సాస్ టెక్ యూనివర్సిటీకి చెందిన కెవిన్ గ్రియర్, రాబిన్ గ్రియర్ ఈఅధ్యయన పరిశోధకులుగా వ్యవహరించారు. దీనికి ప్రామిసెస్, ప్రామిసెస్: గ్రోత్ ఇన్ ఇండియా అండర్ మోదీ అండ్ ది బీజేపీ అని పేరు పెట్టారు. మోదీ నాయకత్వంలోని పాలన పదేండ్లు గడిచిన తరుణంలో పది కీలకమైన పాలన సూచికల పరంగానూ, తలసరి జీడీపీ పరంగానూ భారతదేశ పనితీరు క్షీణించిందని వారి నివేదిక పేర్కొంది.
భారత్లో మోదీ పాలన లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదనే ఊహాజనిత అంశాన్ని పరిశీలించడం ద్వారా వారి నివేదిక విశ్లేషించిన ప్రకారం 2014 వరకు ఉన్నభారత్ తన యథాతథ విధానాన్ని కొనసాగించి ఉంటే 2023 నాటికి దేశ తలసరి ఆదాయం వాస్తవ స్థాయి కంటే 1,000 డాలర్లు ఎక్కువగా ఉండేది. భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇతర ఏడు కీలక సూచికల ర్యాంకింగ్లలో కూడా భారత్ ఎంతో మెరుగైన స్థానంలో ఉండేదని నివేదిక పేర్కొంది. వారు పరిశీలించిన సూచికల్లో రాజకీయ అవినీతి, ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సంఘ స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వం, చట్టం ముందు సమాన రక్షణ, కార్యనిర్వాహక వర్గంపై న్యాయవ్యవస్థ పరిమితులు, శాసనపరమైన పరిమితులు ఉన్నాయి.
ఈ పది సూచికల్లో పదేండ్లు దాటిన మోదీ పాలనలో పరిస్థితి గణనీయంగా క్షీణించినట్టు నివేదిక తెలిపింది. మోదీ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చారా లేదా అన్నదే ఈ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు. ఉదార ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వం గణనీయంగా క్షీణించాయని నివేదిక పేర్కొంది. వాటిలో మతస్వేచ్ఛ అత్యంత తీవ్రమైన క్షీణతను నమోదు చేసింది.