తిరువనంతపురం: కేరళలో ఓ వైపు కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగానే నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిఫా వైరస్ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా ఓ 12 ఏండ్ల బాలుడు నిఫా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో రాష్ట్ర ఆరోగ్యశాక అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా కేరళలో నిఫా వైరస్ విస్తృతిపై దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్రం నుంచి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ఆ బృందం నిఫా వైరస్ విషయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖకు అవసరమైన సాయం అందించనుంది.
ఈ నిఫా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. ముఖ్యంగా గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఇది పందులు, కుక్కలు, గుర్రాలు ఇతర జంతువులకు కూడా సోకుతుంది. మనుషులకు సోకినప్పుడు వైరస్ లోడ్ ఎక్కువైతే మరణం సంభవిస్తుంది. 2018లో కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో కూడా ఈ నిఫా వైరస్ కేసులు బయటపడ్డాయి. అప్పట్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. తాజాగా ఇప్పుడు మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టించడం, ఓ బాలుడు మృతి చెందడం మళ్లీ ఆందోళన రేకెత్తిస్తున్నది.
నిఫా వైరస్ బారినపడి ఈ తెల్లవారుజామున 5 గంటలకు కోజికోడ్లో 12 ఏండ్ల బాలుడు మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ఆ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. అయితే అతనిలో నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో రక్త నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు. అక్కడ నిఫా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆ బాలుడిని మొదట ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి కోజికోడ్లోని మెడికల్ కాలేజీకి తరలించారు.
ఈ నిఫా కలకలంపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి స్పందించారు. పరిస్థితి అదుపులోనే ఉన్నదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి అనుసరించాల్సిన జాగ్రత్తలపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. బాధిత బాలుడి కుటుంబం, గ్రామం, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఫా ఆనవాళ్లు ఉన్నాయేమో తెలుసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు సూచించింది. బాధిత బాలుడితో గత 12 రోజుల్లో కాంటాక్ట్ అయినవారిని గుర్తించాలని, ఆ కాంటాక్ట్స్ను క్వారెంటైన్లో ఉంచాలని ఆదేశించింది.