న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు పాము కాటుకు కొత్త తరహా విరుగుడు కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే సింథటిక్ యాంటీబాడీ తయారుచేశారు. దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుందని తెలిపారు. తైవాన్ పాము విషాన్ని ఎలుకలకు ఇంజెక్ట్ చేసి, యాంటీబాడీల పనితీరును పరిశీలించారు. భారత్లోని నాగుపాము, సబ్ సహారాలో ఎక్కువగా ఉండే బ్లాక్ మాంబా పాము విషాలపైనా ప్రయోగాలు చేశామని, సంప్రదాయ యాంటీబాడీల కన్నా.. ప్రస్తుతం అభివృద్ధి చేసిన సింథటిక్ యాంటీబాడీ దాదాపు 15 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నదని సైంటిస్టులు తేల్చారు.
ఈ వివరాల్ని ‘జర్నల్ సైన్స్ ట్రాన్స్లేషన్ మెడిసిన్’లో ప్రచురించారు. దీని ప్రకారం, ‘హెచ్ఐవీ, కొవిడ్ రోగాల్ని గుర్తించేందుకు అనుసరించిన విధానాన్నే ఇక్కడా సైంటిస్టులు ఎంచుకున్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసేందుకు యాంటీబాడీలను ఈ విధానంలో తయారుచేయటం ఇదే తొలిసారి’ అని ఐఐఎస్సీ పీహెచ్డీ విద్యార్థి సెంజి లక్ష్మి చెప్పారు. ‘పాముల విషానికి వ్యతిరేకంగా విస్తృత రక్షణ ఇవ్వగల సార్వత్రిక యాంటీబాడీని తయారు చేయటంలో ముందడుగు పడింది’ అని పరిశోధనలో పాలుపంచుకున్న అమెరికాకు చెందిన ‘స్క్రిప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ సైంటిస్టులు చెప్పారు.