శ్రీకాకుళం: అసని తుఫాన్తో బంగాళాఖాతంలో భీకర అలజడి ఉంది. ఏపీ తీరం వెంట సముద్రం ఉప్పొంగుతోంది. అయితే ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రా తీరానికి వింత రథం కొట్టకువచ్చింది. సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు బంగారు వర్ణం కలిగిన రథం ఒకటి కొట్టుకువచ్చింది. ఆ రథాన్ని వీక్షించేందుకు స్థానిక ప్రజలు ఎగబడుతున్నారు. సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడు చూడని వింతైన రథం మంగళవారం కొట్టుకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. బహుశా ఆ రథం మరో దేశం నుంచి వచ్చి ఉంటుందని నౌపాడా ఎస్సై తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారులకు ఈ విషయాన్ని చెప్పామని, ఉన్నతాధికారులు దీన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
#WATCH | Andhra Pradesh: A mysterious gold-coloured chariot washed ashore at Sunnapalli Sea Harbour in Srikakulam y'day, as the sea remained turbulent due to #CycloneAsani
SI Naupada says, "It might've come from another country. We've informed Intelligence & higher officials." pic.twitter.com/XunW5cNy6O
— ANI (@ANI) May 11, 2022
సముద్రంలో కొట్టుకు వచ్చిన రథంపై తేది 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉందన్నారు. మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. తీరానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఈ రథాన్ని పెద్ద తాళ్లతో లాగుతూ ఒడ్డుకు చేర్చారు. బంగారు వర్ణంతో ఈ రథం మెరిసిపోతోంది. భారీ స్వర్ణ రథం కొట్టుకొచ్చిందన్న విషయం తెలియగానే.. దీన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు.
ఇటీవలి తుఫాను సమయంలో సైతం తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర తీరంలో బంగారు నాణేలు లభించాయి. సున్నాపల్లి రేవుకు స్వర్ణ రథం కొట్టుకొచ్చిన విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రథాన్ని పరిశీలించారు. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందనే విషయం తెలియాల్సి ఉంది.