నాగ్పూర్: ఇంట్లో తరచూ కరెంటు పోతుండటంతో ఓ 30 ఏళ్ల వ్యక్తి విసిగిపోయాడు. ఈ కరెంటు కోతలకు ప్రభుత్వమే కారణమని ఆగ్రహించాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా అతని ఇంట్లో కరెంటు పోయింది. ఉక్కపోతతో నిద్రపట్టక అర్ధరాత్రి రెండు గంటలకు లేచాడు. తన పరిస్థితికి ప్రభుత్వమే కారణమని ప్రతీకారంతో రగిలిపోయాడు. అదే ఆవేశంలో వెనుకాముందూ ఆలోచన లేకుండా నాగ్పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్కు అర్ధరాత్రి ఫోన్ చేశాడు.
తాను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికి బాంబు పెట్టానని చెప్పాడు. ఎందుకు అని..? ఫోన్ తీసిన పోలీస్ ఆరా తీస్తుండగానే కాల్ కట్ చేశాడు. దాంతో పోలీసులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ను తీసుకుని నాగ్పూర్లోని డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లారు. ఇంటి లోపల, బయట క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత ఈ ఫేక్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నాగ్పూర్కు 30 కిలోమీటర్ల దూరంలోని కన్హన్ పట్టణంలో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇలా ఎందుకు చేశావని అడిగిన పోలీసులు.. నిందితుడు చెప్పిన సమాధానం విని షాకయ్యారు. తన ఇంట్లో తరచూ కరెంటు పోతున్నదని, అందుకే అలా చేశానని నిందితుడు చెప్పాడు. దాంతో, నిందితుడిపై సంబంధించి సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.