ముంబై: టీవీ నటి తునిషా శర్మ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తున్నది. తాజాగా మరో విషయాన్ని ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న వాలివ్ పోలీసులు బయటపెట్టారు. తునిషా ఆత్మహత్యకు కొన్ని నిమిషాల ముందు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు గుర్తించారు. ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు సేకరించిన సీసీ ఫుటేజ్లో.. తునిషా, షీజాన్ వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి.
దాంతో షీజాన్ పురికొల్పడంవల్లే తునిషా ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలకు బలం చేకూరింది. తునిషా, షీజాన్ మొబైల్ ఫోన్లలోని డాటా బయటికి వస్తే కేసుకు సంబంధించి మరిన్ని రహస్యాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నది. తునిషాను ఆత్మహత్యకు పురికొల్పాడన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టయిన షీజాన్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.