చామరాజనగర్: చనిపోయిన భార్యను వాహనంలో తరలించేందుకు ఆర్థిక స్తోమత లేని ఓ వ్యక్తి ఆమె శవాన్ని గోనెసంచిలో మూటకట్టి భుజాలపై మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. 15 రోజుల క్రితం కళమ్మ (26), ఆమె భర్త రవి యలందూర్ పట్టణానికి వచ్చారు. అటవీశాఖ భవనం దగ్గర ప్లాస్టిక్ వస్తువులు సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన కళమ్మ మంగళవారం రాత్రి చనిపోయింది. రవి దగ్గర నయాపైసా కూడా లేకపోవడంతో ఆమె శవాన్ని బస్తాలో కట్టి పట్టణ సమీపంలోని సువర్ణవతి నది వద్ద ఖననం చేసేందుకు భుజాలపై మోసుకెళ్లాడు. విషయం తెలుసుకొన్న పోలీసులు.. వాంగ్మూలాన్ని రికార్డు చేసుకొని, కళమ్మ మృతి గురించి తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్య శవాన్ని భర్త భుజాలపై మోసుకెళ్తున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు భర్తపై సానుభూతి వ్యక్తంచేశారు.