న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మయాపురి ఏరియాలో ఇవాళ ఒక వివాహ వేడుక జరిగింది. దానికి ముందు వధూవరులు ఇద్దరిని అంగరంగవైభవంగా ఆడుతూ, పాడుతూ వివాహ వేదికపైకి తీసుకొచ్చారు. వరుడిని మండపం పైకి తీసుకొచ్చేటప్పుడు ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. వరుడి స్నేహితులు అతడి మెడలో రూ.500 నోట్లు గుచ్చిన దండవేసి అతడి ముందు డీజే చప్పుళ్లతో ఆడుతూపాడుతూ ఎంజాయ్ చేశారు.
ఆ తర్వాత మండపానికి తీసుకెళ్లేందుకు వరుడిని గుర్రం ఎక్కిస్తుండగా అనుకోని ఘటన జరిగింది. ఎప్పటి నుంచి కాపుగాస్తున్నాడో ఏమోగానీ సరిగ్గా అప్పుడే ఓ 14 ఏళ్ల బాలుడు ఒక్క ఉదటున ముందుకు ఉరికొచ్చి వరుడి మెడలో ఉన్న కరెన్సీ నోట్ల దండ తెంచుకుని పారిపోయాడు. చూసేవాళ్లకు అక్కడ ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే ఆ బాలుడు మెరుపు వేగంతో అక్కడి నుంచి మాయమయ్యాడు.
ఈ ఘటనపై పెళ్లికొడుకు స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 79 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ, వరుడి స్నేహితులు మాత్రం తాము దండకు మొత్తం 329 నోట్లు గుచ్చామని చెబుతున్నారు.