పుణె: దేశంలో టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. అయినా రైతులకు ఒరుగుతున్న లాభమేమీ లేదు. వర్షాలవల్ల పంటలు మురిగిపోయి దిగుబడి తగ్గడంతో పెట్టుబడి ఖర్చులైనా వస్తే చాలనే స్థితిలో మెజారిటీ రైతులు ఉన్నారు. కానీ పంట నష్టం జరగని కొద్దిమంది రైతులు మాత్రం కోట్లు గడిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన ఓ రైతు టమాటలు అమ్మి కోటీశ్వరుడయ్యాడు. ఈ సీజన్లో 17 వేల ట్రేల టమాటలు అమ్మి రూ.2.8 కోట్లు సంపాదించాడు.
వివరాల్లోకి వెళ్తే.. పుణెకి చెందిన ఈశ్వర్ గయాకర్ అనే 36 ఏళ్ల రైతు తన 12 ఎకరాల పొలంలో టమాట పంటను సాగుచేశాడు. ఈ 12 ఎకరాల పొలంలో దాదాపు 4 లక్షల కిలోల టమాట పండింది. అందులో నుంచి 3.40 లక్షల కిలోల టమాటను ఇప్పటికే విక్రయించాడు. వాటి ద్వారా రూ.2.8 కోట్లు సొమ్ము చేసుకున్నాడు. ఇంకా అతని దగ్గర 60 వేల కిలోల టమాట ఉంది. వాటిని కూడా ఇదే ధరల్లో విక్రయించి ఈ సీజన్లో తన సంపాదనను రూ.3.5 కోట్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు గయాకర్ తెలిపాడు.
సాధారణంగా అయితే కిలో టమాట ధర రూ.20 నుంచి రూ.30 వరకు ఉండేది. కానీ ఈ సీజన్లో సమయానికి వర్షాలు పడక కొంత, ఆ తర్వాత అవసరానికి మించి వర్షాలు పడటంవల్ల కొత పంటనష్టం వాటిల్లింది. దాంతో టమాట ధరలు చూస్తుండగానే చుక్కలనంటాయి. కిలో టమాట ఏకంగా రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలుకుతోంది. అదే సమయంలో గయాకర్కు అధికంగా దిగుబడి రావడం కలిసొచ్చింది.
కాగా, తాను ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం గడించడంలో తన భార్య పాత్ర కూడా ఉన్నదని ఈశ్వర్ గయాకర్ చెప్పాడు. ఇద్దరం కష్టపడి పంట సాగుచేశామని తెలిపాడు. అయితే, తాము గత ఏడు సంవత్సరాల నుంచి టమాట సాగు చేసి విక్రయిస్తున్నామని, చాలాసార్లు నష్టాలను చవిచూశామని, ఇప్పుడు భారీగా లాభాలు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
2021లో టమాట సాగువల్ల రూ. 20 లక్షల నష్టం వచ్చిందని తెలిపాడు. అయితే, తాము కేవలం టమాటలను మాత్రమే కాకుండా సీజన్ల వారీగా ఉల్లిపాయలు, పువ్వులను కూడా సాగు చేస్తామని ఈశ్వర్ చెప్పాడు. కాగా, గత రెండుమూడు రోజులుగా దేశవ్యాప్తంగా టమాట ధరలు దిగి వస్తున్నాయి. త్వరలోనే కిలో టమాట రూ.80 నుంచి రూ.90 స్థాయికి దిగివచ్చే సూచనలున్నాయి. మరో రెండుమూడు వారాల్లో కిలో టమాట ధరలు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.