పట్నా: దేశంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడం కోసం ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఇప్పటికే 158 కోట్లకు పైగా వ్యాక్సిన్లు ఇచ్చారు. ప్రభుత్వ నియమావళి ప్రకారం.. ఇప్పటివరకు అర్హులైన ప్రతి ఒక్కరు తొలి డోసు, రెండో డోసు, మూడో డోసు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్కరు మూడు డోసులు తీసుకోవచ్చు. కానీ బీహార్ రాజధాని పట్నాకు చెందిన విభాకుమారి సింగ్ అనే వైద్యురాలు ఏకంగా ఐదు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.
విభాకుమారి మొత్తం ఐదు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా రికార్డులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే సదరు వైద్యురాలు మాత్రం తాను ప్రభుత్వ నియమాలకు లోబడి మూడు డోసులు మాత్రమే తీసుకున్నానని, మిగతా రెండు డోసులు తన పాన్ కార్డు వివరాలను ఉపయోగించి ఎవరో తీసుకుని ఉంటారని ఆమె చెబుతున్నారు. దాంతో ఈ ఘటనపై బీహార్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
వైద్యురాలు కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాల ప్రకారం.. 2021 జనవరి 28న తొలి డోసు, మార్చి చివరి వారంలో రెండో డోసు తీసుకున్నారు. 2022 జనవరి 13న బూస్టర్ డోసు వేయించుకున్నారు. కానీ బీహార్ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఆమె మొత్తం ఐదు డోసులు తీసుకున్నట్లుగా ఉంది. 2021 ఫిబ్రవరి 6న మూడో డోసు, 2021 జూన్ 17న నాలుగో డోసు తీసుకున్నట్లు ప్రభుత్వ రికార్డులు సూచిస్తున్నాయి.