Heartwarming Story | ఓ కూతురు తన తల్లికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. 25 ఏండ్లకే భర్తను కోల్పోయి, దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. కండ్ల ముందున్న పసిబిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి తన జీవితాన్ని త్యాగం చేసింది. టీచర్ ఉద్యోగం చేస్తూనే ఒక్కగానొక్క కూతురుని పెంచి పెద్ద చేసింది. ఆమెను ప్రయోజకురాలిగా తీర్చిదిద్దింది. కానీ భర్త లేడన్న బాధ ఆమెను వెంటాడుతూనే ఉంది. తల్లి బాధను అర్థం చేసుకున్న కూతురు.. చివరకు అన్నీ తానై ఆమెకు పెళ్లి చేసింది. హృదయాన్ని కదిలించే ఈ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.
కూతురు దేవ్ ఆర్తి రియా చక్రవర్తి మాటల్లోనే.. గతేడాది ఒక సాయంత్రం తన అత్త నుంచి నాకు కాల్ వచ్చింది. మీ అమ్మను ఇష్టపడే వ్యక్తి ఒకరున్నారు. అప్పుడు నేను ఎక్సయిటింగ్గా ఫీలయ్యాను. ఎందుకంటే నాన్న చనిపోయిన తర్వాత అమ్మ నన్ను తీసుకొని నాని ఇంటికి వచ్చేసింది. అక్కడే పెరిగాను. అప్పుడు నా వయసు కేవలం 2 సంవత్సరాలు. అమ్మకు 25 ఏండ్లు. అయితే అమ్మను పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు. కానీ అమ్మ తిరస్కరిస్తూ వచ్చింది. పెళ్లి చేసుకుంటే నాకు ప్రేమ దొరుకుతుందేమో, కానీ నీకు నాన్న దొరకడు అని అమ్మ చెప్పేది.
నన్ను పెంచేందుకు అమ్మ తన జీవితాన్నే త్యాగం చేసింది. టీచర్గా పని చేస్తూనే నా బాగోగులు అన్నీ చూసుకునేది. నేను పెరిగి పెద్దగా అయ్యాను. ఇప్పుడు అమ్మను మంచిగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయం రానే వచ్చింది. వెనక్కి తిరిగి చూడలేదు.
కొద్ది రోజుల తర్వాత నేను అమ్మ దగ్గరకు వెళ్లాను. నేను ఒక మ్యూజిక్ యాప్లో చేరానని అమ్మ నాకు చెప్పింది. ఆ యాప్లో స్వాపన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని తెలిపింది. అతను అమ్మ పాటలకు పెద్ద అభిమాని. అలా వారిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. నేను అతనితో ఒక రోజు మాట్లాడి.. అమ్మ మీతో మాట్లాడాలనుకుంటుందని చెప్పాను. కానీ అమ్మ తన ప్రేమను వ్యక్తపరిచేందుకు మొహమాటం పడింది. కానీ ఆమె మనసును నేను చేంజ్ చేశాను. నీ జీవితం ఇంతటితో ఆగిపోలేదు. అతనికి ఒక్క చాన్స్ ఇవ్వమని అమ్మకు చెప్పాను.
కొద్ది నెలల తర్వాత అంటే గతేడాది అక్టోబర్లో అతన్ని ఇష్టపడుతున్నట్లు అమ్మ నాకు చెప్పింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వెంబడే స్వాపన్తో నేను మాట్లాడాను. అతన్ని సంతోషాన్ని కూడా గమనించాను. ఇక వారిద్దరూ సంతోషంగా ఉంటారని తెలిసిపోయింది. ఇక ఇరు కుటుంబాలు కలిసి అమ్మ పెళ్లి గురించి చర్చించుకున్నాయి. పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించాం. అమ్మ ఏదో చిన్నగా పెళ్లి వేడుక నిర్వహించమని అడిగింది. కానీ నేను స్వయంగా గువహటి వెళ్లి అమ్మ పెళ్లికి కావాల్సిన షాపింగ్ చేశాను. ఇక సంప్రదాయం ప్రకారం అమ్మ పెళ్లి చేశాను. ఆ రోజు నాకు బాగా గుర్తు ఉంది. అమ్మ చాలా నర్వస్కు గురైంది. ఎరుపు రంగు చీర ధరించి, నుదుట తిలకం పెట్టడంతో చాలా అందంగా కనిపించింది అమ్మ. ఇక చెవి పక్కన చుక్క పెట్టి నేను బోరును ఏడ్చేశాను. ఆ క్షణం అమ్మను చూస్తే చాలా హ్యాపి అనిపించింది.
పెళ్లి అయిపోగానే స్వాపన్ నా దగ్గరకు వచ్చాడు. అమ్మ నీకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుందని చెప్పాడు. నేను ఒక నవ్వు నవ్వి, ఇద్దర్ని హగ్ చేసుకున్నాను. వారికి పెళ్లి అయి ఇప్పటికీ 9 నెలలు గడుస్తుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు అమ్మతో మాట్లాడిన ప్రతిసారి ఆమె గొంతులో హ్యాపినెస్ చూస్తున్నాను.
మూడు నెలల క్రితం అందరం కలిసి షిల్లాంగ్ వెళ్లాం. అప్పుడనిపించింది.. అమ్మకు పార్ట్నర్ దొరకడమే కాదు.. నాకు కూడా ఒక మంచి తండ్రి దొరికాడని. అమ్మ సంతోషం.. నాకు సంతోషాన్ని తెచ్చిపెట్టింది అని చక్రవర్తి చెప్పుకొచ్చింది.