Republic Day Parade | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పొగ మంచు కురుస్తుండటంతో భారీ మార్పు చోటు చేసుకున్నది. గణతంత్ర దినోత్సవ పరేడ్ ఒక అరగంట ఆలస్యంగా ప్రారంభం అవుతుందని రక్షణశాఖ అధికారి ఒకరు చెప్పారు. సంప్రదాయంగా ప్రతియేటా ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. కానీ పొగ మంచు కురుస్తుండటంతో 10.30 గంటలకు ప్రారంభించాలని రక్షణశాఖ నిర్ణయించింది.
ఈ నెల 26న ఢిల్లీని మంచు దుప్పటి కప్పేస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కనుక పరేడ్ను ప్రేక్షకులు వీక్షించడానికి వీలుగా దాన్ని అరగంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించాం అని రక్షణశాఖ అధికారి ఒకరు చెప్పారు.
ఇక రాజ్పథ్ మార్గంలో రోడ్డుకిరువైపులా ఐదు ఎల్ఈడీ స్క్రీన్ల చొప్పున ఏర్పాట్లు చేస్తున్నది రక్షణ శాఖ. పరేడ్ ప్రారంభం కావడానికి ముందు గత రిపబ్లిక్డే పరేడ్-ఉత్సవాల వీడియోలు.. సాయుధ బలగాలపై చిత్రించిన షార్ట్ ఫిల్మ్లు, ఇతర స్ఫూర్తిదాయక వీడియోలను ఈ స్క్రీన్లపై ప్లే చేస్తారు. పరేడ్ ప్రారంభం కాగానే లైవ్లో చూడొచ్చు. గతేడాది మాదిరిగానే కరోనా వల్ల ఈ ఏడాది కూడా నిరాడంబరంగానే రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవాల్సి వచ్చింది.