భోపాల్, జూలై 16: మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లాలో దారుణం జరిగింది. 19 ఏండ్ల యువతిపై ఉన్నావో(యూపీ)కు చెందిన నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి చెల్లెలిపైనా లైంగికదాడికి ఒడిగట్టారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న దాతియా నియోజకవర్గం పరిధిలో శుక్రవారం ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి నుంచి తీసుకున్న ఫిర్యాదు ఆధారంగా నిందితుల్లో ఒకరు స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడు ఉన్నాడని తెలిసింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నిందితుల్లో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బాధితుల బంధువులు, స్థానికులు దాతియా పోలిస్ స్టేషన్కు చేరుకొని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బాధితుల్లో ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నించారని, అయితే ఆమెను వెంటనే దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులు విద్యార్థులని, ఘటనపై విచారణ జరుపుతున్నామని దాతియా జిల్లా ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. వారిపై పోక్సో సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. నిందితులు యువతి, ఆమె చెల్లెల్ని బలవంతంగా ఓ ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. లైంగిక దాడి ఘటనను దాతియా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర బుధోలియా తీవ్రంగా ఖండించారు.