Viral News | జైపూర్, జూలై 29: సోషల్ మీడియా ప్రేమ ఘటనలు ఇటీవల తరచుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన పాకిస్థాన్ అబ్బాయిని కలిసేందుకు 16 ఏండ్ల బాలిక ప్రయత్నించింది. విమానంలో లాహోర్ వెళ్లేందుకు శుక్రవారం రాజస్థాన్లోని జైపూర్ ఎయిర్పోర్టుకు వెళ్లగా.. ఎయిర్పోర్టు అధికారులు బాలికను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.
అంతర్జాతీయ ప్రయాణానికి అవసరమైన ఎటువంటి పత్రాలు లేకుండా, లాహోర్ వెళ్లేందుకు టికెట్టు ఇవ్వండి! అంటూ బాలిక అడిగింది. దీంతో పాటుగా ఒక కట్టు కథ అల్లింది. పేరు గజల్ మహ్మద్గా పేర్కొన్న సదరు బాలిక.. తాను పాకిస్థాన్ పౌరురాలిని అని, మూడేండ్ల క్రితం తమ సమీప బంధువు ఒకరితో భారత్కు వచ్చానని, పెండ్లికి బలవంతం చేస్తుండటంతో తిరిగి తన దేశానికి వెళ్లాలని అనుకొంటున్నానని అధికారులకు చెప్పింది. విచారణలో బాలికను సికర్ జిల్లాలోని శ్రీమధోపూర్కు చెందిన నివాసిగా అధికారులు గుర్తించారు.