ముంబై : కరోనా మహమ్మారి కేసుల మధ్య ముంబైలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధానిలోని ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న 96శాతం మంది రోగులు టీకాలు వేయని వారేనని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇందులో ఎక్కువ మంది 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులే.
అయితే, ఇప్పటికే కొవిడ్ టీకాలు తీసుకోని వారికి ఆక్సిజన్ సపోర్ట్, అదనపు సహాయం అవసరమని వైద్యులు సైతం పేర్కొన్న విషయం విధితమే. ఈ నెల 6వ తేదీ వరకు ఉన్న డేటాను పరిశీలించగా.. ఆక్సిజన్ బెడ్లలో చేరిన 1,900 మంది కరోనా రోగుల్లో.. 96 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారు ఉండగా, కేవలం నాలుగు శాతం మందికి టీకాలు అందాయని బీఎంసీ (BMC) కమిషనర్ ఇక్బాల్ చాహల్ తెలిపారు.
కరోనా కేసుల పెరుగుదల తర్వాత చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడం ప్రారంభించారని డాక్టర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇంకా సమగ్ర అధ్యయనం జరగలేదని, అయితే ఆక్సిజన్ సపోర్ట్పై టీకాలు వేయకుండానే రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ తీసుకోని వారికి కరోనా వచ్చే ప్రమాదం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియజేస్తోందని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల మహారాష్ట్రలో రోజువారీ కరోనా విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం మహారాష్ట్రలో కొత్తగా 40,925 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికిపైగా ముంబై నగరంలోనే రికార్డయ్యాయి.