లక్నో: పోలీస్ కస్టడీలో చిత్రహింసలను భరించలేని ఒక నగల వ్యాపారి చనిపోయాడు. దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 9 మంది పోలీసులపై హత్య కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. బల్వంత్ సింగ్ అనే ఆభరణాల వ్యాపారిపై మరో నగల వ్యాపారి చోరీ ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న పోలీసులు ఆయనను రానియా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బల్వంత్ సింగ్ను చిత్రహింసలకు గురి చేయడంతో కస్టడీలో ఆయన చనిపోయాడు. అయితే గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించారు.
కాగా, బల్వంత్ సింగ్ మృతదేహంపై 22 చోట్ల గాయాలున్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు. పోలీసులు కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపారని వారు ఆరోపించారు. బల్వంత్ సింగ్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసనకు దిగారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు అంత్యక్రియలు నిర్వహించబోమంటూ నినాదాలు చేశారు.
మరోవైపు బీజేపీ ఎంపీ దేవేంద్ర సింగ్ భోలే ఈ సంఘటనపై జోక్యం చేసుకున్నారు. దీంతో డాక్టర్ల కమిటీతో బల్వంత్ సింగ్ మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో 9 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. హత్యా నేరంతోపాటు పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు.
అయితే ఈ విషయంపై సీఎం యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడినట్లు బీజేపీ ఎంపీ దేవేంద్ర సింగ్ తెలిపారు. కస్టడీ డెత్ను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం, భూమి, ఇల్లు, పిల్లలకు ఉచితంగా విద్య, వృద్ధురాలైన తల్లికి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.