cheetahs : మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కు మరో 9 చీతాలు చేరుకున్నాయి. దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా నుంచి ఈ తొమ్మిది చీతాల్ని అధికారులు ఇండియాకు తీసుకొచ్చారు. వీటిని త్వరలోనే ప్రత్యేక నివాస స్థలాల్లోకి వదలనున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ చీతా’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 2023 వరకు మొత్తం 20 చీతాల్ని విదేశాల నుంచి తీసుకొచ్చారు. మొదట సెప్టెంబర్ 2022లో ఎనిమిది చీతాల్ని నమీబియా నుంచి తీసుకొచ్చారు.
అలాగే రెండో దశలో ఫిబ్రవరి 2023లో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మూడో దశలో బోట్స్వానా నుంచి 9 చీతాల్ని తీసుకొచ్చారు. వీటిలో మూడు మగ చీతాలు, ఆరు ఆడ చీతాలున్నాయి. బోట్స్వానా నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ప్రత్యేక విమానంలో మధ్య ప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణానికి తీసుకొచ్చారు. వీటిని కూనో నేషనల్ పార్క్ పరిధిలో చీతాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలోకి వదిలిపెడతారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వీటిని విడుదల చేయనున్నారు. అక్కడ వీటిని అధికారులు, నిపుణులు పర్యవేక్షిస్తుంటారు. ఈ చీతాల రాకతో దేశంలో వీటి సంఖ్య 48కి చేరింది. దేశంలో చీతాల సంఖ్య పెంచాలని కేంద్రం భావిస్తోంది. అందువల్లే మన దేశంలో అంతరించిపోయే దశలో ఉన్న వీటిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది.
దీనిలో భాగంగా ‘ప్రాజెక్ట్ చీతా’ చేపట్టింది. విదేశాల నుంచి వీటిని తీసుకొస్తోంది. అయితే, వీటిని పెంచడం అంత సులభం కాదు. కొన్ని చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేక మరణించాయి. అయినప్పటికీ కేంద్రం వీటిని పెంచడానికి కృషి చేస్తోంది. కూనో నేషనల్ పార్క్ వీటికి అనువైన ప్రదేశం. ఇక్కడ 2023లో 39 చీతా కూనలు ఉండగా.. వాటిలో ఇప్పుడు 27 జీవించి ఉన్నాయి. అలాగే అన్ని చీతాల్ని ఒకే చోట ఉంచడం లేదు. వీటికి వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున కొన్నింటిని గాంధీ సాగర్ అభయారణ్య కేంద్రానికి తరలించి సంరక్షిస్తున్నారు.