న్యూఢిల్లీ: చక్రాల కుర్చీలో ఎయిర్పోర్ట్కు వచ్చిన 80 ఏండ్ల వృద్ధురాలి దుస్తులను బలవంతంగా విప్పించి తనిఖీ చేశారు. దీనిపై ఆ వృద్ధురాలి కుమార్తె ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన సీఐఎస్ఎఫ్ ఆ మహిళా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అస్సాం రాజధాని గౌహతి ఎయిర్పోర్ట్లో గురువారం ఈ ఘటన జరిగింది. ఢిల్లీ వెళ్లేందుకు 80 ఏండ్ల వృద్ధురాలు తన మనవరాలితో కలిసి చక్రాల కుర్చీలో ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఆపరేషన్ వల్ల ఆమె తుంటికి రాడ్ వేశారు. దీంతో తనిఖీ సందర్బంగా బీప్ శబ్దం వచ్చింది. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆ వృద్ధురాలిని బలవంతంగా దుస్తులు విప్పించి తనిఖీ చేసింది. ఆమె వెంట ఉన్న మనమరాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడున్న ఫార్మ్లో ఫిర్యాదు చేయగా స్వీకరించేందుకు సిబ్బంది నిరాకరించారు. అనంతరం వారిద్దరు విమానంలో ఢిల్లీకి చేరారు.
కాగా, ఆ వృద్ధురాలి కుమార్తె డాలీ కికాన్, ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్, అస్సాం సీఎం, గౌహతి ఎయిర్పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగురాలైన తన 80 ఏండ్ల తల్లి పట్ల అవమానకరంగా ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రవర్తించారని ఆరోపించారు. తుంటి ఆపరేషన్ సందర్భంగా వేసిన టైటానియం ఇంప్లాంట్ పరిశీలనకు బలవంతంగా దుస్తులు విప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అసహ్యకరమైన చర్య అని విమర్శించారు.
దీనిపై స్పందించిన సీఐఎస్ఎఫ్ డీఐజీ ఆ వృద్ధురాలికి కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు తెలిపారు. ఆ మహిళా కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్లు చేసినట్లు సీఐఎస్ఎఫ్ పేర్కొంది. మరోసారి ఇలా జరుగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. మరోవైపు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా దీనిపై స్పందించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్వీట్ చేశారు.