న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 24% పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు స్థూలంగా మొత్తం రూ.8.98 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది. నిరుడు ఇదే కాలంలో వసూలైన ప్రత్యక్ష పన్నుల కంటే ఈసారి 23.8% అధికంగా వసూలైనట్టు స్పష్టం చేసింది. కార్పొరేట్ పన్నులతోపాటు వ్యక్తిగత ఆదాయ పన్నులను ప్రత్యక్ష పన్నులుగా పేర్కొంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు 16.74%, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 32.30% పెరిగినట్టు ఆర్థిక శాఖ వివరించింది. రిఫండ్ల సర్దుబాటు తర్వాత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయని, ఏడాది క్రితం ఇదే కాలంలో వచ్చిన నికర వసూళ్ల కంటే ఇది 16.3% అధికమని, బడ్జెట్ అంచనాల్లో ఈ వసూళ్లు 52.46 శాతానికి సమానమని పేర్కొన్నది. ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఈ ఏడాది ఏప్రిల్ 1-అక్టోబర్ 8 మధ్య కాలంలో రూ.1.53 లక్షల కోట్లు రిఫండ్ చేశామని, నిరుడు ఇదే కాలంలో రిఫండ్ చేసిన మొత్తం కంటే ఇది 81% ఎక్కువని తెలిపింది.