న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం బడ్జెట్ 66 శాతం పెరిగింది. దీని కింద రూ.79 వేల కోట్లను కేటాయించారు. అలాగే పట్టణ మౌలిక ప్రణాళికను చేపట్టేందుకు రాష్ర్టాలు, నగరాలను ప్రోత్సహించనున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి తరహాలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని కేంద్రం రూపొందిస్తున్నదని పేర్కొన్నారు. దీనిని జాతీయ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని వెల్లడించారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి పది వేల కోట్లను ఖర్చు చేస్తున్నదని, అన్ని నగరాలు, పట్టణాల్లో మురుగు కాల్వలు, సెప్టిక్ ట్యాంకులను మ్యాన్హోల్ నుంచి మెషిన్ హోల్ పద్ధతిలోకి వందశాతం మార్చునున్నామని తెలిపారు. పట్టణ పౌర సంస్థల ఆర్థిక, క్రెడిట్ యోగ్యతను మెరుగుపరిచేందుకు మునిసిపల్ బాండ్ల ద్వారా నిధులను సేకరించే విషయంలో ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు.