న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్.. సైనిక సత్తాతో వెలిగిపోనున్నది. గణతంత్ర దినోత్సవం రోజున జరగనున్న ఆర్డీ పరేడ్లో ఈ ఏడాది 75 విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించనున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను గగనవీధిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఏఎఫ్ పీఆర్వో వింగ్ కమాండర్ ఇంద్రానిల్ నంది ఈ విషయాన్ని తెలిపారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో.. రాజ్పథ్పై 75 విమానాలు కనువిందు చేయనున్నట్లు ఆయన చెప్పారు. భారతీయ వైమానిక దళం, సైన్యం, నౌకాదళానికి చెందిన విమానాలు ఫ్లై పాస్ట్ విన్యాసాల్లో పాల్గొంటాయి.
రాజ్పథ్పై అయిదు రాఫేల్ యుద్ధ విమానాలు.. వినాశ్ ఫార్మేషన్లో పాల్గొనున్నట్లు వింగ్ కమాండర్ ఇంద్రానిల్ నంది తెలిపారు. నేవీకి చెందిన మిగ్29కే, పీ-81 నిఘా విమానాలు వరుణ ఫార్మేషన్లో ఆకట్టుకోనున్నాయి. ఇక 17 జాగ్వార్ యుద్ధ విమానాలు 75 ఆకారంలో ఆకాశవీధిలో ఎగరనున్నాయని వింగ్ కమాండర్ చెప్పారు.