జోర్హాత్/గువాహటి: అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 120 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ.. ప్రభుత్వానికి చెందిన ఓ స్టీమర్ను ఢీకొట్టి మునిగిపోయింది. జోర్హాత్ జిల్లాలోని నీమతి ఘాట్ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. ఇప్పటివరకూ 50 మందిని రక్షించామని, 70 మంది వరకు గల్లంతైనట్టు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) డిప్యూటీ కమాండర్ శ్రీవాస్తవ తెలిపారు. రాష్ట్ర జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్)తో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పడవ ప్రమాదంలో ఒక మహిళ మరణించినట్టు జోర్హాత్ ఎస్పీ అంకూర్ జైన్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరుగొచ్చన్నారు. పడవ ఢీకొన్న స్టీమర్లో ఉన్న లైఫ్గార్డుల సాయంతో కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చినట్టు వెల్లడించారు. పడవలో ఉన్న వాహనాలు, బైకుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. కాగా పడవ మునిగిపోతున్న సమయంలో ప్రాణాలను రక్షించుకోవడానికి కొందరు నదిలో దూకుతున్నట్టు వీడియోల్లో రికార్డయ్యింది.
ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశం
ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతామన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదంపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన నీమతి ఘాట్లో గురువారం పర్యటిస్తానన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై మెజిస్టీరియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.