లక్నో, సెప్టెంబర్ 2: ఏడేండ్ల రాగిణి వీపుపై బ్యాగ్తో ఒంటి కాలితో కుంటుకుంటూ పాఠశాలకు వస్తున్న దృశ్యం ఇప్పుడు మీడియాలో వైరల్ అయ్యింది. యూపీలోని బల్లియాకు చెందిన ఈ బాలిక ఆరు నెలల వయసులో ఉన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. పేదవారైన తల్లిదండ్రులు తమ శక్తికొద్దీ దవాఖానల చుట్టూ తిరిగి చికిత్స చేయించినా ఆమె కాలు నయం కాలేదు. ఇంటి ముందర నుంచి పలువురు పిల్లలు పాఠశాలకు వెళ్లడాన్ని చిన్నప్పటి నుంచి చూసిన రాగిణి తాను కూడా స్కూల్కు వెళ్తానని పట్టుబట్టింది. దీంతో ఆమెను ఒక పాఠశాలలో చేర్చారు.
అయితే దినసరి కూలీలైన ఆమె తల్లిదండ్రులకు రాగిణిని రోజూ పాఠశాలకు తీసుకువెళ్లడం కుదరలేదు. దీంతో ఆమె ఇంటికి 400 మీటర్ల దూరంలోని పాఠశాలకు ఒంటికాలితో కుంటుతూ కాళ్లు నొప్పులు పుడితే మధ్యలో ఆగుతూ చేరుకుంటుంది. ఎంత కష్టమైనా సరే పాఠశాలకు వెళ్తానని, దానిని మాత్రం మాననని రాగిణి స్పష్టం చేసింది. అయితే డీఎం (డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) తనకొక మూడు చక్రాల సైకిల్ను సమకూరిస్తే ఎంతో సంతోషిస్తానని ఆమె కోరింది. రాగిణి కథనాన్ని మీడియాలో చూసిన ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. ఆప్ స్థానిక నేతలు ఆమె ఇంటిని సందర్శించి కుటుంబానికి రూ. 26,500 ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా బాలికకు ఒక మూడు చక్రాల సైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా సింగ్ ఆ బాలిక, కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడి, ఆ కుటుంబానికి అవసరమైన సహాయాన్ని చేస్తానని హామీనిచ్చారు.