లక్నో: ఉత్తరప్రదేశ్ ఇంటర్ ఇంగ్లీష్ పేపర్ లీక్ కేసులో తాజాగా మరో ఏడుగురిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు స్థానిక జర్నలిస్టులని తెలిపారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 24కు చేరిందన్నారు. ఉత్తరప్రదేశ్లో ఇంటర్బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయ్యింది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు రెండో షిఫ్ట్లో ఈ పరీక్ష జరుగాల్సి ఉంది.
అయితే బల్లియా జిల్లాలో ఇంగ్లీష్ పేపర్ లీక్ అయ్యింది. 316 ఈడీ నుంచి 316 ఈఎల్ సిరీస్ ఇంగ్లీష్ పశ్నాపత్రాలు లీక్అయినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను రూ.500కు మార్కెట్లో అమ్ముతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో యూపీ ఇంటర్ బోర్డు స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12వ తరగతి ఇంగ్లీష్ పశ్నా పత్రాలు లీక్ అయిన సిరీస్కు సంబంధించిన 24 జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం జరుగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేసింది. మిగతా జిల్లాల్లో ఈ పరీక్షను యథావిధిగా నిర్వహించినట్లు ఇంటర్ బోర్డు అధికారి తెలిపారు.
కాగా, పేపర్ లీక్ కారణంగా ఆగ్రా, మెయిన్పురి, మధుర, అలీఘడ్, ఘజియాబాద్, బాగ్పత్, బదౌన్, షాజహాన్పూర్, ఉన్నావ్, సీతాపూర్, లలిత్పూర్, మహోబా, జలౌన్, చిత్రకూట్, అంబేద్కర్నగర్, ప్రతాప్గఢ్, గోండా, గోరఖ్పూర్, అజంగర్పూర్, బల్లియా, వారణాసి, కాన్పూర్ దేహత్, ఎటా, షామ్లీ జిల్లాల్లో బుధవారం జరుగాల్సిన 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రద్దయ్యింది. ఈ నేపథ్యంలో ఈ 24 జిల్లాల్లో ఏప్రిల్ 13న ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించనున్నట్లు యూపీ ఇంటర్ బోర్డు గురువారం వెల్లడించింది.
మరోవైపు 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్పై దర్యాప్తు కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.