లక్నో: ఉత్తరప్రదేశ్లోని మథురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున యమున ఎక్స్ప్రెస్ వేపై (Yamuna Expressway) మథుర వద్ద వ్యాగనార్ కారు మరోఆ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. మృతదేహాలను కష్టంగా కారులోనుంచి బయటకు తీశారు. మృతుల్లో చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. నోయిడాలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
కాగా, యమునా ఎక్స్ప్రెస్ వే ప్రమాద ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.