లక్నో: ఐఏఎస్ అధికారిణికి చెందిన ఆవు అనారోగ్యం బారిన పడింది. దీంతో దాని చికిత్స కోసం ఏడుగురు ప్రభుత్వ పశు వైద్యులకు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయం బయటపడటంతో వివాదస్పదమైంది. ఉత్తర ప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లా మేజిస్ట్రేట్ అనుప్రియ దూబేకు చెందిన ఆవు అనారోగ్యం పాలైంది. దీంతో ఆ ఆవుకు చికిత్స కోసం ఏడుగురు ప్రభుత్వ పశు వైద్యులకు విధులు కేటాయించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆవును పరిశీలించి నివేదిక అందజేయాలని పశు వైద్యులను చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన జారీ చేసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు 2017లో యూపీలోని రాంపూర్లో జరిగిన ఒక సంఘటనను ఇది గుర్తు చేసింది. ఎస్పీ నేత అజామ్ ఖాన్కు చెందిన గేదెలు మాయమయ్యాయి. దీంతో వాటిని వెతికేందుకు పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. చివరకు పోలీస్ డాగ్స్ సహాయంతో ఆ గేదెల ఆచూకీని గుర్తించారు.
కాగా, ఐఏఎస్ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక ఐఏఎస్ అధికారి తన పెంపుడు కుక్కతో వాక్ చేసేందుకు క్రీడాకారులను ముందుగానే స్టేడియం నుంచి ఖాళీ చేయించడం వివాదస్పదమైంది. దీంతో ఆ ఐఏఎస్ అధికారిని లఢక్కు ఆయన భార్యను అరుణాచల్ ప్రదేశ్కు బదిలీ చేశారు.