పనాజీ: గోవా కాంగ్రెస్లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరిలో కొందరు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గోవా వర్షాకాల, బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. రెండు వారాలపాటు ఇవి కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీ కాంగ్రెస్, సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది. అయితే ఈ ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దీనికి గైర్హాజరయ్యారు. వారిలో కొందరు బీజేపీతో టచ్లో ఉన్నట్లుగా మీడియా కథనాలు వెలువడ్డాయి. మైఖేల్ లోబోను ప్రతిపక్ష నేతగా నియమించడంపై దిగంబర్ కామత్ అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తున్నది.
కాగా, గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ పాట్కర్ ఈ వదంతులను ఖండించారు. అధికారంలో ఉన్న బీజేపీ ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. పార్టీ ఎమ్మెల్యేల్లో ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని అన్నారు. మరోవైపు మంగళవారం జరుగాల్సిన డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను గోవా అసెంబ్లీ స్పీకర్ రమేష్ తవాడ్కర్ ఆదివారం రద్దు చేశారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 25 మంది, ప్రతిపక్ష కాంగ్రెస్కు 11 మంది ఎమ్మెల్యేలున్నారు.