6G Technology | దేశంలో ఇంకా 5జీ టెక్నాలజీనే రాలేదు. కానీ 6జీ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. టెలికం రంగం ముందుకెళ్లేదేకానీ, వెనక్కు మళ్లేది కాదు కదా. ఈ క్రమంలోనే ఒక వెబినార్లో మాట్లాడిన కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే భారత్లో స్వదేశీ విధానంలో తయారు చేసిన 6జీ వ్యవస్థ అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. ‘6జీ సాంకేతికను అభివృద్ధి చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీన్ని భారత్లోని పరికరాలతో, దేశంలోని టెలికం సాఫ్ట్వేర్తోనే తయారుచేస్తాం. అదే సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేలా అభివృద్ధి చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు.
2023 చివరికి లేదా 2024 ప్రారంభంలో స్వదేశీ 6జీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే వచ్చే ఏడాదిలోనే 5జీని లాంచ్ చేయనున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో అంటే మార్చి తర్వాత 5జీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం గురించి కూడా అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఈ విషయంలో ఇప్పటికే ట్రాయ్ (టీఆర్ఏఐ) పలు కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించిందని, ఈ చర్చలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి ముగుస్తాయని వెల్లడించారు.
అలాగే 2022 రెండో త్రైమాసికంలోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో టెలికం రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని పేర్కొన్నారు.