సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ 66 శాతం నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ డాటాను విడుదల చేసింది. రాష్ట్రంలోని 68 నియోజకవర్గాలకుగానూ 412 మంది అభ్యర్థులు పోటీపడగా.. అత్యధికంగా సిర్మౌర్ జిల్లాలో 72.35 శాతం, సోలన్లో 68.48 శాతం మంది ఓటు వేశారు. అత్యల్పంగా లాహౌల్, స్పిటిలో 21.95 శాతం పోలింగ్ నమోదైంది. సీఎం జైరాం ఠాకూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సెరాజ్ నియోజకవర్గంలో 74 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నా భార్మౌర్ నియోజకవర్గంలో 83 ఏండ్ల మహిళ చాసక్ భత్ప్రి ఓటు వేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసి, తనువు చాలించిన విషయం తెలిసిందే.