తిరువనంతపురం: ఒక ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా (Medical negligence) వ్యవహరించారు. వృద్ధురాలి ఎడమ కాలికి బదులు కుడి కాలికి సర్జరీ చేశారు. కేరళలోని కోజికోడ్లో ఈ సంఘటన జరిగింది. 60 ఏళ్ల సజినా సుకుమారన్ ఇటీవల గాయపడింది. ఆమె ఎడమ కాలు తలుపులో ఇరుక్కుంది. దీంతో తీవ్రమైన కాలు నొప్పితో ఆమె బాధపడుతున్నది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లింది. ఆ ఆసుపత్రిలోని సర్జన్ అయిన డాక్టర్ బెహిర్షన్ ఆమె కాలు గాయాన్ని పరిశీలించారు. ఎడమ కాలు నరం దెబ్బతిన్నట్లు ఎక్స్ రేలో గుర్తించారు. సర్జరీ ద్వారా సరి చేయాలని చెప్పారు. దీంతో సజినా ఈ నెల 20న ఆ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆ మరునాడు ఆమె కాలుకు శస్త్రచికిత్స చేశారు.
కాగా, వృద్ధురాలు సజినా తెలివిలోకి వచ్చిన తర్వాత తన కాలును పరిశీలించింది. అయితే గాయమైన ఎడమ కాలుకు బదులుగా కుడి కాలికి సర్జరీ చేసినట్లుగా ఆమె గ్రహించింది. వెంటనే సజినా, ఆమె కుమార్తె నర్సును పిలిచి ఈ విషయం గురించి చెప్పారు. సర్జరీ చేసిన డాక్టర్ను పిలువాలని కోరారు. దీంతో డాక్టర్ బెహిర్షన్ ఆమె వద్దకు వచ్చాడు. జరిగిన పొరపాటును ఆయన గ్రహించాడు. అయితే తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు. సర్జరీ చేసిన కుడి కాలిలో కూడా బ్లాక్ ఉన్నదని చెప్పాడు.
మరోవైపు తన కుడి కాలికి సంబంధించి ఏ సమస్య లేదని, ఎక్స్రే కూడా తీయలేదని ఆ మహిళ తెలిపింది. తన కుడి కాలికి ఏం సర్జరీ చేశారో కూడా అంతుపట్టడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు దీనిపై ఆరోగ్య మంత్రితోపాటు జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఆ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
అయితే ఆ ఆసుపత్రి ఎండీ కూడా సర్జరీ డాక్టర్ను వెనకేసుకొచ్చారు. ఆ మహిళ రెండు కాళ్లకు సమస్య ఉందని తెలిపారు. దీంతో రెండు కాళ్లకు సర్జరీ చేయాల్సి ఉందని ఆ వృద్ధురాలితోపాటు ఆమె భర్తకు కూడా చెప్పినట్లు మీడియాకు వెల్లడించారు.