ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పీతంపుర ( Pitampura) ప్రాంతంలోని ఓ బహుల అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆరురుగు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి గాయపడ్డారు. మృతుల్లో నలుగులు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఏడుగురిని రక్షించి దవాఖానకు తరలించారు.
గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. భవనంలోని మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయని, క్రమంగా మూడో అంతస్తుకు వ్యాపించాయని చెప్పారు. మూడు ఫ్లోర్లను దట్టమైన పొగలు కమ్ముకున్నాయని చెప్పారు. పొగలకు తోడు అగ్ని కీలలు చుట్టుముట్టడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారని, వారు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.