4జీ ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే.. 10-25 రెట్లు ఎక్కువ వేగంతో.. మరింత ఎక్కువ పరిధిని కవర్ చేసే సూపర్ ఫాస్ట్ మొబైల్ ఇంటర్నెట్ 5జీ సర్వీసులు (ఐదోతరం ఇంటర్నెట్ సేవలు) అమెరికా, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఇప్పటికే పరుగులు పెడుతున్నాయి. దేశీయంగా కూడా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, 5జీకి దీటుగా స్వదేశీ సాంకేతికతతో అత్యంత చవగ్గా ‘5జీఐ’ పేరిట ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్ పరిశోధకులు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత భేష్గా ఉన్నదని ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) కితాబిచ్చినప్పటికీ, ఈ సేవలు దేశంలోకి వచ్చేది.. లేనిదీ.. ఓ మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలింది. ఎందుకు?
ఏమిటీ ‘5జీఐ’
5జీ సాంకేతికతకు ‘లోకల్’ రూపమే ‘5జీఐ’. 5జీ సేవల్లో వినియోగించే ఫ్రీక్వెన్సీ బ్యాండ్ రేంజ్తో పోలిస్తే తక్కువ ఫ్రీక్వెన్సీలో (ఎల్టీఈ కంటే కొంచం ఎక్కువ) ఈ సేవల ప్రసారం జరుగుతుంది. చవకైన హై-స్పీడ్ ఇంటర్నెట్గా ‘5జీఐ’ని పిలుస్తున్నారు.
‘5జీఐ’తో లాభం?
ఇంటర్నెట్ వేగాన్ని పెంచేందుకు ఫ్రీక్వెన్సీ బ్యాండ్ రేంజ్ను పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న 4జీ పౌనఃపున్యం పరిధి 450-700 మెగాహెర్ట్ (ఎల్టీఈ రేంజ్ 700-2,100 మెగాహెర్ట్). ఈ పౌనఃపున్యం తీవ్రతను పెంచుతూ (దాదాపు 700-52,000 మెగాహెర్ట్) 5జీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ను అంతర్జాతీయ టెలికం సమాఖ్య ఖరారు చేసింది. దీని పరిధిలో ఇంటర్నెట్ వేగం గణనీయంగా పెరిగినప్పటికీ, ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీనికి చెక్ పెట్టేందుకే.. ఐఐటీ-హైదరాబాద్, ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు ‘5జీఐ’ని తీసుకొచ్చారు. ఎల్టీఈ రేంజ్ కంటే కొంచం ఎక్కువగా, 5జీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లోని దిగువ స్థాయి ఫ్రీక్వెన్సీ బ్యాండ్ను ఈ సాంకేతికతలో వినియోగించారు. ఫలితంగా అత్యంత చవకైన రేటులోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఈ సాంకేతికతలో మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీని వినియోగించడంతో.. ‘5జీ’కి సమానమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండటంతోపాటు కొండ ప్రాంతాలు, లోయల్లో కూడా ‘5జీఐ’ ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి.
మరి ‘5జీఐ’కి అడ్డంకేంటి?
5జీఐ సాంకేతికతను లోతుగా పరిశీలించిన ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) దాని వినియోగానికి అన్ని అనుమతులనిచ్చింది. ఈ సాంకేతికత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు కితాబిచ్చింది కూడా. అయితే, అన్ని అనుమతులను పూర్తిచేసుకున్న ఈ స్వదేశీ సాంకేతికత దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అసలు వస్తుందా? రాదా అనేది ఓ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి కారణం.. 5జీ సాంకేతికత ఆధారంగా పనిచేసే మొబైళ్లను తయారుచేసేందుకు శాంసంగ్, ఎరిక్సన్, నోకియా వంటి ఫోన్ కంపెనీలు ఇప్పటికే పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. అలాగే, జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం సంస్థలు 5జీ స్పెక్ట్రమ్ బ్యాండ్ కొనుగోలుకు ప్రణాళికలను, ఆ సేవల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేసుకున్నాయి. వీటన్నింటికి పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేశాయి. 5జీని కాదని.. ఇప్పుడు ‘5జీఐ’కి స్విచ్ కావాలంటే ఆ వ్యవహారం ఈ సంస్థలకు అదనపు భారంగా మారొచ్చు. దీంతో ఏ కంపెనీలు ‘5జీఐ’ వాడకానికి ఇప్పటికిప్పుడు ముందుకు రావడంలేదు.