న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదు చేసిన కేసులకు సంబంధించి వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభకు వెల్లడించింది. 2017 నుంచి 2022, అక్టోబర్ 31 వరకు గడిచిన ఐదేండ్లలో సీబీఐ దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 56 కేసులు నమోదు చేసిందని డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (DoPT) లోక్సభలో ఒక ప్రకటన చేసింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన మొత్తం 56 కేసులకుగాను ఇప్పటి వరకు 22 కేసులలో చార్జిషీట్ దాఖలైందని DoPT లోక్సభకు తెలిపింది. DoPT తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 56 సీబీఐ కేసులలో అత్యధికంగా 10 కేసులు ఆంధ్రప్రదేశ్లోనే నమోదయ్యాయి.
ఆ తర్వాత ఆరేసి కేసులతో ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదేసి, తమిళనాడులో నాలుగు సీబీఐ కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో ఒకటి, రెండు, మూడు చొప్పున సీబీఐ కేసులు నమోదు చేసింది.