న్యూఢిల్లీ : 16 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీసీఏ) సమావేశాలకు సభ్యుల హాజరు సగటున 53శాతానికే పరిమితమవుతున్నదని లోక్సభ వెబ్సైట్లోని గణాంకాలు వెల్లడించాయి. నిరుడు సెప్టెంబర్లో ఈ కమిటీలను పునర్వ్యవస్థీకరించినప్పటి నుంచి వివిధ కీలక అంశాలపై జరిగిన చర్చలకు సగటున 53 శాతం మంది సభ్యులే హాజరయ్యారని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇదే సమయంలో కనీస సభ్యులు లేకపోవడం కారణంగా పార్లమెంటరీ కమిటీలకు సంబంధించిన ఐదు సమావేశాలు వాయిదా పడ్డాయి.
ఒక్కో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. వీరిలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక పబ్లిక్ కమిటీ విషయానికొస్తే మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. వీరిలో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులు ఉంటారు. వ్యవసాయం, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, రసాయనాలు-ఎరువులు, ఇంధన, సామాజిక న్యాయం-సాధికారత తదితర 16 స్టాండింగ్ కమిటీల సమావేశాలకు సగటున దాదాపు 47 శాతం మంది సభ్యులు సమావేశాలకు గైర్హాజరయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.