రాష్ట్రవ్యాప్తంగా బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న 507 మందిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 నుంచి మతమార్పిడులకు సంబంధించి ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్లో 291 కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అయిన 507మందిపై రాష్ట్రంలోని పలు కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయి. 291 కేసుల్లో దాదాపు 59 కేసులు మైనర్ల మతమార్పిడికి సంబంధించినవిగా అధికారులు చెప్తున్నారు. దాదాపు 150 కేసుల్లో అరెస్ట్ అయినవాళ్లు తమను బలవంతంగా మతమార్పిడికి పురిగొల్పారని ఇప్పటికే కోర్టుకు తెలియజేశారు. జిల్లాలవారీగా చూస్తే బరేలీలో ఎక్కువ మతమార్పిడి కేసులు నమోదయ్యాయి. దివ్యాంగులైన పిల్లల్ని బలవంతంగా మతమార్పిడి చేస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. అయితే, అరెస్ట్ అయిన 507మందిలో ఒక్కరు కూడా తాము బలవంతపు మతమార్పిడులకు పాల్పడినట్టు ఒప్పుకోలేదని సమాచారం.
బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేందుకు యోగీ ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని యూపీ సర్కార్ 2020 నవంబర్లో బలవంతపు మతమార్పిడుల నివారణ చట్టంను తీసుకొచ్చింది. ఈ చట్టం నవంబర్ 27వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దాంతో, అప్పటి నుంచి బలవంతపు మతమార్పిడులకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ చట్టం కింది అరెస్ట్ అయినవాళ్లు మతమార్పిడులకు పాల్పడినట్టు నిరూపణ అయితే కనిష్టంగా 3 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రూ.15 వేల నుంచి 50 వేల జరిమానా కూడా చెల్లించాల్సి రావొచ్చు.