హిసార్: ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) 32 ఏండ్లుగా పడుతన్న శ్రమకు ఫలితం దక్కింది. హర్యానాలోని రాఖీ గర్హీలో (Rakhi Garhi) 5 వేల ఏండ్లనాటి ఆభరణాల తయారీ కేంద్రాన్ని గుర్తించింది. దీంతో ఏఎస్ఐ ఇప్పటివరకు కనిపెట్టినవాటిలో ఇదే అతిపెద్దదిగా నిలిచింది. సింధు లోయ నాగరికతకు చెందిన పురావస్తు ప్రదేశాల్లో ఒకటైన రాఖీగర్హీలో గత 32 ఏండ్లుగా ఏఎస్ఐ తవ్వకాలు జరుపుతున్నది. తాజాగా, అక్కడ కొన్ని ఇండ్ల నిర్మాణాలను, వంటగది సముదాయం, ఐదు వేల ఏండ్లనాటి ఆభరణాల తయారీ కేంద్రాన్ని కనుగొన్నది. వాటితోపాటు రాగి, బంగారు ఆభరణాలకు కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆ కాలంలో ఇది అతి ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లిందని అధికారులు చెబుతున్నారు.
రాఖీగర్హీలో ఏఎస్ఐ గత రెండు నెలల్లో చాలా ఆవిష్కరణలు చేసింది. తాజాగా బయటపడిన ఇండ్ల సముదాయం.. నాగరికత క్రమంగా అభివృద్ధి వైపు పురోగమిస్తున్నట్లుగా సూచిస్తున్నదని వెల్లడించారు.