న్యూఢిల్లీ, జూలై 9: అగ్నివీర్ స్కీమ్లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకొనే అవకాశం కనిపిస్తున్నది. త్రివిధ దళాల్లో సైనికుల కొరత, ఇతర సమస్యల నేపథ్యంలో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని సైన్యం కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భద్రతా బలగాల్లోకి శాశ్వత ప్రాతిపదికన తీసుకొనే అగ్నివీరుల సంఖ్యను 25 నుంచి 50 శాతానికి పెంచడం, సైన్యంలో చేరే అభ్యర్థుల గరిష్ఠ అర్హత వయసును 21 ఏండ్ల నుంచి 23కి పెంచడం వంటివి ఉన్నట్టు తెలుస్తున్నది. 2026 వరకు రిక్రూట్మెంట్ల సంఖ్యపై నియంత్రణ కారణంగా భవిష్యత్తులో జవాన్ల స్థాయిలో సిబ్బంది తక్కువయే చాన్స్ ఉన్నదని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత నిబంధనల్లో మార్పులు తీసుకురాకుంటే.. సరిపడా సైనికులను భర్తీ చేసుకొనేందుకు కొన్నేండ్ల సమయం పడుతుందని తెలిపాయి.