Rajasthan | జైపూర్ : రాజస్థాన్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. భానుడి భగభగలకు జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజస్థాన్లోని ఫలోడిలో గత 24 గంటల్లో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు జైపూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ రాధేశ్యామ్ శర్మ వెల్లడించారు. ఈ ఏడాది ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం ఇదే ఫలోడీలో 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల పాటు ఈ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 29వ తేదీ నుంచి 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని డైరెక్టర్ రాధేశ్యామ్ పేర్కొన్నారు.
భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుండె జబ్బులు ఉన్నవారు చల్లని ప్రదేశాల్లో ఉంటే మంచిదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని సూచన చేశారు.