నుహ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుండలి-మనేసర్-పల్వాల్ కేఎంపీ ఎక్స్ప్రెస్వే(KMP Expressway)పై జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన అయిదుగురు పోలీసులు మృతిచెందారు. అతివేగంతో వెళ్తున్న వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. తౌరు సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దులావత్ టోల్ ప్లాజా వద్ద దుర్ఘటన చోటుచేసుకున్నది. ప్రమాద ప్రదేశానికి స్థానిక పోలీసులు, ఎమర్జెన్సీ బృందాలు వెళ్లాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. యూపీలోని జలౌన్ జిల్లాలో ఆ పోలీసులు పోస్టింగ్లో ఉన్నారు. మహేంద్ర స్కార్పియో వాహనంలో వాళ్లు పల్వాల్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
టోల్ ప్లాజా సమీపంలో మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే సమయంలో.. అదుపు తప్పి ముందున్న వాహనాన్ని స్కార్పియో ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ఎస్యూవీ నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఆ వాహనంలో ఉన్న అయిదుగురు పోలీసులు మృతిచెందారు. వాహన శిథిలాల్లో చిక్కుకున్న వారిని తొలగించారు. స్కార్పియో వాహనంలో మృతిచెందిన అయిదుగుర్నీ పోలీసులుగా గుర్తించినట్లు తౌరు సదర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. బాధితులను గుర్తించి, ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.