న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ముగ్గురు న్యాయవాదులు, ఇద్దరు జ్యుడిషియల్ అధికారులకు రాజస్థాన్ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. వివిధ హైకోర్టుల జడ్జిలుగా నియమించేందుకు పలువురి పేర్లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం గత నెలలో సిఫారసు చేసింది. ఈ మేరకు ఈ నెల 6న 5 హైకోర్టులకు 9 మంది జడ్జిలు నియమితులయ్యారు. సోమవారం మరో ఐదుగురి జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో న్యాయవాదులు ఫర్జద్ అలీ, సుదేశ్ బన్సాల్, అనూప్ కుమార్, జ్యుడిషియల్ అధికారులు వినోద్ కుమార్ భర్వానీ, మదన్ గోపాల్ వ్యాస్… రాజస్థాన్ హైకోర్టు జడ్జిలుగా నియమితులయ్యారు.
ఏడుగురు హైకోర్టు జడ్జిల బదిలీ
సోమవారం ఏడుగురు జడ్జిలు వేర్వేరు హైకోర్టులకు బదిలీ అయ్యారు. జస్టిస్ టీ అమర్నాథ్ గౌడ్ (తెలంగాణ నుంచి త్రిపురకు), జస్టిస్ రాజన్ గుప్తా (పంజాబ్-హర్యానా నుంచి పాట్నాకు), జస్టిస్ టీ శివజ్ఞానం (మద్రాస్ నుంచి కలకత్తా), జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్ (హిమాచల్ప్రదేశ్ నుంచి పంజాబ్-హర్యానాకు), జస్టిస్ పీబీ బజంత్రీ (కర్ణాటక నుంచి పాట్నాకు), జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మ (రాజస్థాన్ నుంచి పాట్నాకు), జస్టిస్ సుభాష్ చంద్ (అలహాబాద్ నుంచి జార్ఖండ్కు) బదిలీ అయ్యారు.