న్యూఢిల్లీ, జూలై 16: ఆహార ధాన్యాలతో సహా అన్ని ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుల్డ్(ప్యాక్ చేయకముందు ఎటువంటి బ్రాండింగ్ లేని) ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్రేడర్లు, మండీ వ్యాపారులు శనివారం దేశవ్యాప్తంగా బంద్ పాటించారు. దాదాపు అన్ని రాష్ర్టాల్లోని హోల్సేల్, రిటైల్ ఆహార ధాన్యాల మార్కెట్లు మూతపడ్డాయి. జీఎస్టీ విధింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని నరేలా, బవానాతో పాటు ఇతర ప్రాంతాల్లో మార్కెట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఇది తొలిసారి అని, ఈ నిర్ణయం ట్రేడర్లు, ప్రజలకు నష్టమని ఢిల్లీ గ్రెయిన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు నరేష్కుమార్ పేర్కొన్నారు. నిర్ణయాని ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
చిన్న పరిశ్రమలు నాశనం
మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్ తదితర నగరాల్లో దాల్మిల్స్, ట్రేడర్లు, మండీ వ్యాపారులు వ్యాపార కార్యకలాపాలు నిలిపేసి నిరసన తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నాశనం చేస్తుందని మండిపడ్డారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం 85% వినియోగదారులపై పడుతుందని హోల్సేల్ ట్రేడర్స్ అసోసియేషన్ పేర్కొంది. కర్ణాటకలో ఏపీఎంసీ ట్రేడర్లు పిలుపునిచ్చిన రాష్ట్రబంద్ విజయవంతమైంది. మహారాష్ట్రలోని నవీ ముంబయిలో బంద్ పాటించారు. జమ్ములో ర్యాలీ నిర్వహించారు.