న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఐదుగురు నిందితులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితులైన అన్సార్, సలీం, దిల్షాద్, సోను, అహిర్పై ఈ మేరకు ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన 9 మంది నిందితులను శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోహిణి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు చాలా సున్నితమైందని, ఈ కుట్రలో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉందని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కోర్టుకు తెలిపింది. విచారణ కోసం నిందితులను పశ్చిమ బెంగాల్తోపాటు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పింది.
ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అభియోగాలు నమోదు చేసిన ఐదుగురు ప్రధాన నిందితులను ఎనిమిది రోజులు తమ రిమాండ్కు అప్పగించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టును కోరారు. దీంతో ఎన్ఎస్ఏ కింద అరెస్టు చేసిన నిందితులు అన్సార్, సలీం, దిల్షాద్, సోను, అహిర్ను ఎనిమిది రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు పంపింది. మిగతా నలుగురు నిందితులకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.