HIV | అగర్తల, జూలై 6: త్రిపురలో విద్యార్థులపై హెచ్ఐవీ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత కొన్ని నెలల కాలం లో వందలాది మంది ఈ మహమ్మారి బారిన పడగా, ఇంతవరకు 47 మంది విద్యార్థులు మరణించారు. త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్ఏసీఎస్) వివరాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 828 మంది విద్యార్థులకు ఈ వ్యాధి సోకింది.
ఈ వ్యాధి తీవ్రత వల్ల 47 మంది మరణించారు. ఉన్నత చదువుల కోసం త్రిపురకు చెందిన పలువురు విద్యార్థులు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో దేశంలోని ఇతర ప్రాంత విద్యార్థులకు ఈ వ్యాధి సోకే అవకాశముందని భావిస్తున్నారు.
త్రిపురలోని 220 స్కూళ్లు, 4 కాలేజీ, యూనివర్సిటీల్లోని విద్యార్థులు సూదుల ద్వారా తీసుకునే ప్రమాదకరమైన డ్రగ్స్కు అలవాటుపడినట్టు గుర్తించామని, దీని ద్వారానే ఈ వ్యాధి సోకుతున్నదని టీఎస్ఏసీఎస్ జాయింట్ డైరెక్టర్ భట్టాచార్య తెలిపారు. ప్రతిరోజూ ఐదు నుంచి ఏడు వరకు కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగుచూస్తున్నాయని చెప్పా రు. వ్యాధి బారిన పడుతున్న వారిలో సంపన్న కుటుంబాలకు చెందిన వారి పిల్లలే అధిక సంఖ్యలో ఉన్నారన్నారు.