హైదరాబాద్: అమెరికాకు చెందిన పీవ్ రీసర్చ్ సెంటర్ ఇండియాలో విభిన్న మతాలపై సర్వే చేపట్టింది. హిందువులు కొలుస్తున్న తమ ఇష్టదైవాలపై ఆ సర్వేలో ఓ నివేదికను పొందుపరిచారు. హిందువుల్లో పాలపుర్ దేవుడిగా శివుడిని అత్యధికంగా పూజిస్తున్నారు. శంకరుడిని అత్యధికంగా 45 శాతం మంది హిందువులు ఆరాధిస్తున్నట్లు ఆ సర్వే చెప్పింది. ఆ తర్వాత జాబితాలో హనుమాన్, గణేశుడు, లక్ష్మీ, కృష్ణుడు, కాళీమాత, రాముడు ఉన్నారు. అయోధ్య రాముడి కన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆయన సేవకుడు హనుమంతుడిని పూజిస్తున్నట్లు సర్వేలో తేలింది. శ్రీరాముడిని 17 శాతం మంది పూజించగా.. హనుమంతుడిని 32 శాతం మంది హిందువులు ఆరాధిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
పీవ్ రీసర్చ్ సెంటర్ తమ స్టడీలో భాగంగా సుమారు 30వేల మందిని సర్వే చేసింది. 2019 నవంబర్ నుంచి మార్చి 2020 మధ్య ఆ అధ్యయనం సాగింది. 2021 జూన్ 29న ఆ సర్వే నివేదికను రిలీజ్ చేశారు. ఆ నివేదికలో ఉన్న కొన్ని ఆసక్తికర అంశాలను మాత్రమే ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. 89 శాతం మంది హిందువులు తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా పాటిస్తున్నట్లు చెప్పారు. కేవలం అయిదు శాతం మంది ముస్లింలు, హిందువులు మాత్రమే మత వివక్ష ఉన్నట్లు ఫిర్యాదు చేశారు.
చాలా వరకు భారతీయుల్లో ఇతర మతంతో ఇబ్బంది ఏమీలేదన్నారు. కానీ తమ పొరుగు వారు మాత్రమే తమ మతస్థులై ఉంటే బాగుంటుందని సర్వేలో పేర్కొన్నారు. వీరిలో జైనులు ముందు వరుసలో ఉన్నారు. 61 శాతం మంది జైనులు తమ పొరుగువారు తమ మతానికే చెందినవారై ఉండాలన్నారు. దేశ విభజన జరిగి 75 ఏళ్లు అవుతోంది. అయితే ఆ విభజన వల్లే మత ఘర్షణలు ఎక్కువైనట్లు చాలా మంది అభిప్రాయపడ్డారు. 27 శాతం ముస్లింలు పూర్వజన్మపై నమ్మకం ఉందన్నారు. 77 శాతం మంది హిందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్మారు. 73 శాతం మంది విధిని కూడా వ్యక్తం చేశారు.