న్యూఢిల్లీ: ఇటీవల రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 40 శాతం మందికి నేర చరిత్ర ఉంది. ఇందులో 12 శాతం మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) తెలిపాయి. హత్య, మహిళలపై నేరాలతో సహా అనేక నేరారోపణలు వారు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నాయి. అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన 57 మంది కొత్త ఎంపీల్లో 23 మందిపై (40 శాతం) నేర సంబంధ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే 12 మందిపై (21 శాతం) హత్య, హత్యా యత్నం, దొంగతనం, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేర కేసులున్నట్లు ఏడీఆర్ తెలిపింది.
కాగా, 22 మంది బీజేపీ కొత్త రాజ్యసభ సభ్యుల్లో 9 మందికి, 9 మంది కాంగ్రెస్ ఎంపీల్లో నలుగురికి, టీఆర్ఎస్, ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎంపీలు, వైఎస్ఆర్పీ, డీఎంకే, ఏఐడీఎంకే, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), ఎస్హెచ్ఎస్, ఇండిపెండెంట్ నుంచి ఒక్కో ఎంపీకి నేర చరిత్ర ఉన్నట్లు ఏడీఆర్ వివరించింది.
మరోవైపు ఉత్తర ప్రదేశ్లోని 11 మంది ఎంపీల్లో ఆరుగురికి, మహారాష్ట్రలోని ఆరుగురు ఎంపీల్లో నలుగురికి, తమిళనాడులోని ఆరుగురు ఎంపీల్లో ముగ్గురికి, బీహార్లోని ఐదుగురు ఎంపీల్లో నలుగురికి, తెలంగాణ, ఏపీ ఎంపీల్లో ఒకొక్కరికి, ఛత్తీస్గఢ్లోని ఇద్దరిలో ఒకరికి, రాజస్థాన్లోని నలుగురు ఎంపీల్లో ఒకరికి, హర్యానాలోని ఇద్దరు ఎంపీలో ఒకరికి నేర చరిత్ర ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది.
అలాగే రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 53 మంది (93 శాతం) మిలియనర్లని, మొదటి మూడు సంపన్న అభ్యర్థుల్లో టీఆర్ఎస్కు చెందిన బండి పార్థ సారధి మొత్తం ఆస్తులు రూ.5,300 కోట్లు, ఇండిపెండెంట్ ఎంపీ కపిల్ సిబల్ మొత్తం ఆస్తులు రూ.608 కోట్లు, పంజాబ్కు చెందిన ఆప్ ఎంపీ విక్రమ్జిత్ సింగ్ మొత్తం రూ.498 కోట్ల ఆస్తులని ఏడీఆర్ వివరించింది. కొత్తగా ఎన్నికైన సగటు ఎంపీల ఆస్తుల విలువ రూ.154.27 కోట్లుగా పేర్కొంది.