న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు డాక్టర్లు చేరారు. బుధవారం జరిగిన మెగా మంత్రివర్గ విస్తరణలో 36 మందికి కొత్తగా మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్లో కొత్తగా చేరిన వారిలో నలుగురు డాక్టర్లు ఉన్నారు. మహారాష్ట్ర నాసిక్కు చెందిన ఎంపీ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, మహారాష్ట్ర ఔరంగాబాద్కు చెందిన పిల్లల డాక్టర్ భగవత్ కరాద్, పశ్చిమ బెంగాల్ బంకురా ఎంపీ, గైనకాలజిస్ట్ డాక్టర్ సుభాస్ సర్కార్, గుజరాత్ సురేంద్రనగర్కు చెందిన డాక్టర్ మహేంద్ర ముంజపారా బుధవారం కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
దేశంలో కరోనా నియంత్రణలో వైఫల్యంపై ప్రధాని మోదీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్థన్ను మంత్రివర్గం నుంచి తప్పించారు. కాగా, కొత్తగా నలుగురు డాక్టర్లు కేబినెట్లో చేరడంతో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న డాక్టర్లైన మంత్రుల సంఖ్య ఆరుకు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖను వీరిలో ఎవరికి అప్పగిస్తారో మరి. మరోవైపు మంత్రివర్గ విస్తరణతో కేబినెట్లో ఉన్న న్యాయవాద మంత్రుల సంఖ్య 13కు, ఇంజినీర్ల సంఖ్య 5కు, సివిల్ సర్వీసెస్కు చెందిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. ఏడుగురు మహిళా ఎంపీలకు కూడా తాజాగా కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.